అశ్లీల వీడియోల రచ్చ..ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ సస్పెన్షన్‌ వేటు..

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు కలకలం రేపుతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్‌ఆర్‌ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. జేడీఎస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జేడీఎస్‌ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ఆరోపించారు. వీడియోలు ప్రజ్వల్‌వేనన్న ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని, ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు. వీడియోల పంపిణీ వెనుక ఉన్నదెవరో తేలాలన్నారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదన్న కుమారస్వామి ఈ కేసుతో తన తండ్రి దేవేగౌడకు, తనకూ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను అధికారులు ఫోరెన్సిక్‌ విభాగానికి పంపడంతో పాటు మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం సిట్‌కు గడువు విధించింది.

ఎన్నికల వేళ ఈ వ్యవహారం జేడీఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు కమలనాథులు. నాలుగో దశలో భాగంగా ఉత్తర కర్ణాటకలో మే7న పోలింగ్‌ జరగనుంది.