మరోసారి పెరగనున్న JIO, Airtel రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు

www.mannamweb.com


దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో, వీఐలు తాజాగా అనగా జూలైలో రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో రీఛార్జ్‌ ప్లాన్‌ మీద ఏకంగా 11-25 శాతం వరకు రేట్లను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 4 నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రైవేట్‌ టెలికాం సంస్థలని రీఛార్జ్‌ ప్లాన్‌ రేట్లను పెంచగా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం రేట్లను పెంచలేదు. దాంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 4 జీ సేవలు ప్రారంభించగా.. తాజాగా శుక్రవారం నాడు అనగా ఆగస్టు 2న 5జీని టెస్ట్‌ చేసింది. ఇక త్వరలోనే ఈ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. ఇప్పటికే వీటి రేట్లను భారీగా పెంచిన టెలికాం కంపెనీలు.. త్వరలోనే మరోసారి రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అనగా 2025 ప్రారంభంలో రీఛార్జ్‌ ప్లాన్‌ రేట్లను పెంచి.. ఆ తర్వాత వాటిని స్థిరంగా కొనసాగించే ఆలోచనలో ఉన్నాయంట. మరి ఈ నిర్ణయం ఎందుకు అంటే.. వచ్చే ఏడాది ప్రథమార్ధం నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఒక్కసారి 5జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరోసారి రీఛార్జ్‌ ప్లాన్‌ రేట్లను పెంచనున్నాయి అని తెలుస్తోంది. దీని గురించి ప్రసాద్‌టెక్‌ఇన్‌తెలుగు యూట్యూబర్‌ సమాచారం అందించాడు. అనగా 2025లో మరోసారి ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచి.. ఆ తర్వాత.. వాటిని స్థిరంగా కొనసాగిస్తాయని ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇది నిజమైతే.. కస్టమర్ల జేబుకు మరోసారి చిల్లు పడటం పక్కా అంటున్నారు.