ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు ‣ మార్చి 11 దరఖాస్తుకు గడువు

www.mannamweb.com


ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు

‣ మార్చి 11 దరఖాస్తుకు గడువు

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ 15 సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవడంతోపాటు 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదా పెట్రోలియం ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ పీజీ 60 శాతం మార్కులతో పాసై 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

‣ ఐడబ్ల్యూసీఎఫ్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌- లెవెల్‌ 4 లేదా ఐఏడీసీ వెల్‌ షార్ప్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌-సూపర్‌వైజర్‌ లెవెల్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

‣ ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్క సంవత్సరంపాటు పనిచేసిన అనుభవం ఉన్నా సరిపోతుంది. ఈ ఉద్యోగులు పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయంలో జీతభత్యాల వివరాలను సమర్పించాలి.

‣ డ్రిల్లింగ్, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌లో పని అనుభవం అవసరం.

‣ డ్రిల్లింగ్, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌ సామగ్రి నిర్వహణ, మడ్‌ కెమికల్స్‌ పరిజ్ఞానం ఉండాలి. మొత్తం 15 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 07, ఓబీసీలకు 04, ఎస్సీలకు 02, ఎస్టీలకు 01, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు. 11.03.2024 నాటికి అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 32-24, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 35-37, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 37-39 సంవత్సరాలు ఉండాలి.

‣ ఓఐఎల్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు.

‣ దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ. 500 (ట్యాక్సులు అదనం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక

అభ్యర్థులను ఫేజ్‌-1లో జరిగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫేజ్‌-2లో జరిగే పర్సనల్‌ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీకి 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు సీబీటీలో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 శాతం సరిపోతుంది. ఇంటర్వ్యూకు అర్హత మార్కులు లేవు.

‣ సీబీటీ వ్యవధి 90 నిమిషాలు. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే 1:5 నిష్పత్తిలో ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.

‣ ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గమనించాల్సినవి..

ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే రాయాలి. ఏడాదిపాటు వీటిని మార్చకూడదు. సీబీటీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులకు వీటి ద్వారానే తెలియజేస్తారు.

‣ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో పరిశీలిస్తారు.

‣ ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

‣ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయింపులు/ సడలింపులు వర్తిస్తాయి.

‣ సీబీటీకి ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా అడ్మిట్‌కార్ట్‌ పంపిస్తారు. పోస్టులో పంపరు.

‣ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఏసీ-2 టైర్‌ రైలు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 11.03.2024

వెబ్‌సైట్‌: https://www.oil-india.com/