ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..

రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు లగేజీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్నా ఈ జాగ్రత్త తప్పదు. లేకపోతే ఊహించని పరిస్థితి ఎదురవుతుంది.


ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తనకు రైల్లో ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ఏసీ కోచ్‌లల్లో ప్రయాణించే జనాలూ ఇలా చేస్తారని తాను ఊహించలేదని కామెంట్ చేశారు (Slippers Stolen in AC 2 Tier Coach Indian Railways).

ఇటీవల పాటలీపుత్ర నుంచి బెంగళూరుకు రైల్లో వస్తున్నప్పుడు తనకు ఈ అనుభవం ఎదురైందని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. తాను ఏసీ 2 టైర్ కోచ్‌లో జర్నీ చేసినట్టు తెలిపారు. రాత్రి హ్యాపీగా నిద్రపోయి మరునాడు లేచే సరికి తన చెప్పులు కనిపించకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా పొరపాటున నా చెప్పులు వేసుకుని వెళ్లిపోయారో లేక కావాలనే దొంగతనం చేశారో అర్థం కావట్లేదు. ఆ చెప్పుల ఖరీదు రూ. 2 వేలు. రైలు దిగాక నేను ఉత్తకాళ్లతో నడవాలి. తలుచుకుంటే నవ్వొస్తోంది. కాస్తంత చికాకుగా కూడా ఉంది. అయినా అంత ఖరీదు పెట్టి 2ఏసీ రైలు టిక్కెట్టు కొనగలిగే వారు మరీ ఇలా కక్కుర్తి పడతారా?’ అని ప్రశ్నించారు.

ఇక ఈ పోస్టుకు నెట్టింట సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోచ్ ఏదైనా సరే రైళ్లల్లో ఇలాంటి అనుభవాలు తప్పవని కొందరు కామెంట్ చేశారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా ఎవరో తన హెడ్‌ఫోన్స్ చోరీ చేశారని ఓ నెటిజన్ తెలిపారు. ఏకంగా ట్యాబ్స్ చోరీ అయిన ఘటనలు కూడా ఉన్నాయని కొందరు అన్నారు. ‘రైళ్లల్లో ఇచ్చే బెడ్‌షీట్స్ చోరీ చేసేందుకు అలవాటు పడ్డ జనాలు చెప్పులు ఎత్తుకు పోయేందుకు ఎంత మాత్రం సందేహించరని ఓ వ్యక్తి సెటైర్ పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.