MLC Kavitha: కవిత మామూలు వ్యక్తి కాదు.. ఎమ్మెల్సీ లీలలు బయటపెట్టిన ఈడీ!

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్‌జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కవితకు బెయిల్‌ రాకుండా ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), సీబీఐ కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు కవితపై దర్యాప్తు సంస్థలే పైచేయి సాధించాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత తనను అకారణంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కవిత లీలలను ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


సాక్షులకు బెదిరింపులు..
కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితే కీలకమని తెలిపారు. సమన్లు జారీ చేసిన తర్వాత కీలకమైన నాలుగు ఫోన్లను రెండు రోజుల్లో ఫార్మాట్‌ చేసిందని పేర్కొన్నారు. సాక్షులను బెదిరించడంతోపాటు సాక్షాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు.ఆమెకు బెయిల్‌ ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు.

ఆమె సాధారణ మహిళ కాదు..
కవిత సాధారణ మహిళ కాదని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. రాజకీయ సామర్థ్యాలు ఉన్న వ్యక్తని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్‌ చేసి వచ్చి, రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే రామచంద్రపిళ్లై తన వాగ్మూలం ఉపసంహరించుకున్నారని తెలిపింది. కవిత ఒత్తిడితోనే ఈ పనిచేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం సాగిన 10 నెలల కాలంలో హోల్సేల్‌ వ్యాపారులు మొత్తం రూ.338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్‌ సంస్థకు రూ.192 కోట్లు దక్కాయని తెలిపారు.

వాట్సాప్‌ చాట్‌లు..
ఆడబ్బు కవితకు చేరినట్లు వాట్సప్‌ చాట్స్‌ ఉన్నాయని తెలిపారు. కవిత బినామీగా ఉన్న రామచంద్ర పెళ్లై ఆమె తరపున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు వాంగ్మూలంలో చెప్పారని తెలిపారు. ఈ రూ. 32 కోట్లలో 4.50 కోట్లు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా అహెడ్‌ సంస్థకు వెళ్లాయని, అందుకు సంబంధించినవాట్సాప్‌ చాట్స్‌ కూడా ఉన్నాయని వెల్లడించారు.

4 ఫోన్లు ఫార్మాట్‌..
గతేడాది మార్చి 21న కవిత దర్యాప్తు సంస్థలకు 9 ఫోన్లు అప్పగించారని తెలిపారు. వాటిలో నాలుగు ఫోన్లు ఫార్మట్‌ చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కూడా ఉందని చెప్పారు. ఆమె సాక్షాలను తారుమారు చేస్తున్న కారణంగానే కింది కోర్టు ఆమెకు బెయిల్‌ ఇవ్వలేదని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్‌ ఇవ్వద్దని ఈడీ, సీబీఐ తరపు లాయర్లు కోర్టును కోరారు.