దేశ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల, ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు నుంచి చారిత్రాత్మక ఊరట లభించింది. శుక్రవారం నాడు వెలువడిన ఈ తీర్పులో, అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది.
సీబీఐ మోపిన ప్రధాన కుట్రపూరిత ఆరోపణలను నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా మనీష్ సిసోడియా చర్యల్లో ఎటువంటి “నేరపూరిత ఉద్దేశం” లేదని, ఆరోపణలు న్యాయపరమైన విచారణలో నిలబడలేకపోయాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కోర్టు వెలుపలికి రాగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడూ స్థితప్రజ్ఞుడిగా కనిపించే ఆయన కళ్లలో ఈరోజు నీళ్లు తిరిగాయి. గొంతులో వణుకు కనిపిస్తున్నా, మాటల్లో మాత్రం స్పష్టత తగ్గలేదు. “నేను అవినీతిపరుడిని కాదు. ఈరోజు కోర్టు కేజ్రీవాల్ మరియు మనీష్ సిసోడియాలను ‘నిజాయితీపరులు’ అని ప్రపంచానికి చాటి చెప్పింది. నా జీవితాంతం నేను సంపాదించుకున్న ఏకైక ఆస్తి నా నిజాయితీ మాత్రమే. ఆ నిజాయితీని కాపాడిన న్యాయవ్యవస్థకు నా పాదాభివందనం,” అంటూ ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు.
కేవలం ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా, తనను జైలు పాలు చేసిన వారిపై కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. “ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర. ఆప్ పార్టీని వేళ్లతో సహా పెకిలించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి పన్నిన వ్యూహం ఇది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి తన ఇల్లు నుంచి ఈడ్చుకెళ్లి జైల్లో పెట్టారు. ఐదుగురు అగ్రనేతలను బంధించి పార్టీని ఖతం చేయాలనుకున్నారు. కానీ సత్యమే జయిస్తుందని (సత్యమేవ జయతే) నేడు నిరూపితమైంది,” అని ఆయన గర్జించారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ విజయంపై స్పందిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పట్ల తనకున్న గౌరవం నేడు వేయి రెట్లు పెరిగిందని చెప్పారు. “కేంద్ర ఏజెన్సీలు మమ్మల్ని దోషులుగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, కేజ్రీవాల్ – సిసోడియా ద్వయం అకుంఠిత నిజాయితీపరులని ఈరోజు భారత న్యాయస్థానం బల్లగుద్ది చెప్పింది,” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
న్యాయస్థానం దృష్టిలో వీగిపోయిన సీబీఐ వాదనలు
ఈ కేసు విచారణలో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ మోపిన కుట్రపూరిత ఆరోపణలు “న్యాయపరమైన పరిశీలనలో విఫలమయ్యాయి” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మనీష్ సిసోడియా చర్యల్లో ఎటువంటి నేరపూరిత ఉద్దేశం లేదని, కేజ్రీవాల్ను ఈ కేసులోకి లాగడానికి బలమైన సాక్ష్యాలు లేవని కోర్టు గమనించింది. ముఖ్యంగా మొదటి మూడు ఛార్జ్షీట్లలో లేని కేజ్రీవాల్ పేరు, నాలుగో దానిలో మాత్రమే చేర్చడాన్ని డిఫెన్స్ తరపు న్యాయవాది ఎన్. హరిహరన్ సమర్థవంతంగా ప్రశ్నించారు. అప్రూవర్ల సాక్ష్యాలకు శాస్త్రీయత లేదని కోర్టు అభిప్రాయపడటంతో, మొత్తం 23 మంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.
ఢిల్లీ మద్యం కేసులో మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కేజ్రీవాల్కు లభించిన ఈ క్లీన్ చిట్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సంజీవనిలా మారింది. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కేజ్రీవాల్, నేడు మరింత పటిష్టమైన నాయకుడిగా బయటకు వచ్చారు.
కేసు పూర్వాపరాలుస న్యాయవాదుల వాదనలు:
2022లో సీబీఐ మొదటి ఛార్జిషీట్తో ప్రారంభమైన ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై ఆరోపణలు వచ్చాయి. సుమారు ₹100 కోట్ల మేర ముడుపులు అందాయని సీబీఐ వాదించినప్పటికీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఎన్. హరిహరన్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ పేరును మొదటి మూడు ఛార్జిషీట్లలో చేర్చలేదని, కేవలం నాలుగో అనుబంధ ఛార్జిషీట్లో మాత్రమే చేర్చారని, అది కూడా ఎటువంటి బలమైన సాక్ష్యాలు లేకుండా కేవలం పాత ఆరోపణలనే పునరావృతం చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, రాజకీయ నాయకులపై మోపిన కుట్ర సిద్ధాంతం నిలదొక్కుకోలేదని స్పష్టం చేస్తూ అందరికీ ఊరటనిచ్చింది.


































