మళ్లీ వార్తల్లోకి కేరళ పద్మనాభస్వామి ఆలయం.. ఆ సీక్రెట్ గదిలో అసలేముంది?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళ(Kerala) లోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం(Anantha Padmanabhaswamy Temple). ఆలయ ప్రాంగణంలోని రహస్య గదులు మళ్ళీ వార్తల్లో వచ్చాయి.


ఆలయం కింద ఉన్న ఆరు నేలమాళిగల్లో ఐదు 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి, వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు. ఆరోవది “బి” గదిని మాత్రం తెరవలేదు. దీనిని కూడా తెరవాలంటూ ప్రస్తుతం డిమాండ్లు వస్తున్నాయి. అయితే, దీనిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ట్రావెన్‌కోర్ రాజకుటుంబం, కొంతమంది పూజారులు, భక్తులు 6వ గదిని తెరిస్తే దైవ శాపం తగులుతుందని భావిస్తున్నారు. రాష్ట్రానికి పెను ప్రమాదం సంభవిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గది తలుపు మీద పాము బొమ్మ చెక్కబడి ఉంది, ఇది ఆ తలుపుకు రక్షణగా ఉన్నదని నమ్ముతారు. గతంలో గదిని తెరిచేందుకు ప్రయత్నించిన పిటిషనర్ అకాల మరణం చెందాడు. దీంతో వారి భయం పెరిగిపోయింది.

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో, ఆలయ ఆస్తుల నిర్వహణలో కొన్ని లోపాలున్నాయని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలంటే “బి” గదిని తెరవడం అవసరమని సూచించారు. ఈ గదిలో ఇతర గదుల కంటే ఎక్కువ సంపద ఉండి ఉండవచ్చని చాలామంది నమ్ముతారు. 2020లో సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే అప్పగించింది. “బి” గదిని తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని మాత్రం ఆలయ నిర్వహణ కమిటీకే వదిలేసింది. అది ఒక మతపరమైన సున్నిత అంశమని కోర్టు అంగీకరించింది.

స్థానిక పురాణాల ప్రకారం, ఈ గదిని ఒక ప్రత్యేకమైన నాగబంధంతో మూసివేశారని, దాన్ని మంత్రాలను జపించడం ద్వారా మాత్రమే తెరవగలరని అంటారు. ఈ తలుపుకు వెనుక అరేబియా సముద్రంతో సంబంధం ఉందని, దాన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తే కేరళ రాష్ట్రం మొత్తం వరదల్లో మునిగిపోతుందని మరికొంతమంది నమ్ముతున్నారు. ఈ కారణంగా, “బి” గదిని తెరవాలన్న డిమాండ్లు ఉన్నప్పటికీ, మతపరమైన విశ్వాసాలు, పురాణాలు, చట్టపరమైన చిక్కుల కారణంగా అది మూసే ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.