లేడీ సింగం చేతిలో కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసు.. ఇదే ఆమె ట్రాక్ రికార్డ్

www.mannamweb.com


Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసును సీబీఐ విచారణ చేస్తోంది. అయితే తాజాగా డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న సీమా పహుజా చేతికి ఈ కేసు వెళ్లింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ట్రాక్ రికార్డు ఏంటి?

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్‌లోని విషయాలు చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆమెను ఎంత దారుణంగా హింసించి చంపారో అందరికీ అర్థమైంది. ఈ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీబీఐ ఇన్వెస్టింగేషన్ కొనసాగుతోంది. అయితే ఈ కేసులను లేడీ సింగంగా పేరున్న సీమా పహుజా చేతికి అప్పగించారు.

సీమా పహుజా ఎవరు?

ఈ కేసులో సీబీఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో దేశం మెుత్తం ఎదురుచూస్తోంది. 30 మంది సభ్యుల బృందంలో సీబీఐ అధికారులు, సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఈ టీమ్‌కు జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం సాక్ష్యాలను కనుగొనడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. చాలా కేసులను ఛేదించిన అనుభవం ఉంది. అయితే ఈ అధికారుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సీమా పహుజా. సీబీఐ ఏఎస్పీ సీమా పహుజా ఈ కేసులో ఉందనడంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

1993లో దిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయ్యారు సీమా పహుజా. దిల్లీ పోలీసు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాక.. సీబీఐలోని అవినీతి నిరోధఖ శాక స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో చాలా కాలం పని చేశారు. ఐదేళ్లకు ఇన్‌స్పెక్టర్‌గా పదొన్నతి సంపాదించారు. ఈ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఛేదించారు. ఆమె ఇన్వెస్టిగేషన్స్ స్కిల్స్ చూసి పై అధికారులు మెచ్చుకునేవారు. తర్వాత 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు.
డైనమిక్ ఆఫీసర్

డీఎస్పీ అయిన తరువాత మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనే కేసులపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులకు శిక్షపడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కోథాయ్‌లోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఓ లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు. అంతేకాదు దేశం మెుత్తం ఉలిక్కిపడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. ఇలా ఆమె చాలా చోట్ల పని చేసి డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్నో అవార్డులు

హరిద్వార్‌లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకుగానూ.. సీమా పహుజాకు 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకున్నారు. 2014లో ఆగస్ట్ 15న ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 2018 కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇలా ఆమె సర్వీస్‌లో చాలా అవార్డులు అందుకున్నారు.

ప్రస్తుతం కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసును సీమా పహుజా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ట్రాక్ రికార్డులో క్లిష్టమైన కేసులను ఛేదించిన అధికారిగా గుర్తింపు ఉంది.