ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా (48) గుండెపోటుతో కన్నుమూశాడు. మంగళవారం (మార్చి 25) తీవ్ర అస్వస్థతకు గురైన అతనని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే మనోజ్ తుది శ్వాస విడిచాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే మనోజ్ కన్నుమూయడంతో భారతీ రాజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు మనోజ్ భారతీ రాజా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మనోజ్ 1998లో తాజ్ మహల్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. అంతకు ముందు ఎంథిరన్ (తెలుగులో రోబో) చిత్రంలో దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు మనోజ్. సముద్రామ్, కాదల్ పూక్కల్, అల్లి అర్జున, వరుషమేళ్ళం వసంతం వంటి చిత్రాల్లోనూ కథానాయకుడిగా మెప్పించాడు మనోజ్. అలాగే శింబు చిత్రం మానాడులోనూ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక నటుడిగా చివరిగా కార్తి విరుమాన్ లో కనిపించాడు మనోజ్. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్లో విడుదలైన స్నేక్స్ అండ్ లాడర్స్ వెబ్ సిరీస్లో నూ మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ భారతీ రాజా కుమారుడు సత్తా చాటాడు. అతను తెరకెక్కించిన కిళ్లిపట్టు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక సక్సెస్, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించిన నందనను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి సాతురియన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇండస్ట్రీలో తండ్రిలా గొప్ప స్థానానికి ఎదుగుతాడనుకున్న మనోజ్ అనూహ్యంగా కన్నమూయడం అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా భారతీ రాజా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.