LPG Gas: ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. తగ్గిన వంటగ్యాస్ ధర

www.mannamweb.com


దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది.
నిజంగా ఇది గొప్ప విషయమే.
దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వంటగ్యాస్‌పై రూ.100 తగ్గించడం చాలా మంచి విషయమే. ముఖ్యంగా నారీ శక్తి లబ్దిదారులకు ఇది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

దీనికి సంబంధించి ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. “నేడు, మహిళా దినోత్సవం సందర్భంగా, మా ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది” అని మోదీ తెలిపారు.
“వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది.” అని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

ఇది మహిళలకు కానుక అని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఐతే.. కారణం ఏదైనప్పటికీ.. దేశ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ కిందే లెక్క.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతీ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తోంది. ఇప్పుడు సబ్సిడీ మరో 100 పెరిగింది. అందువల్ల మొత్తం సబ్సిడీ రూ.400 అవుతుంది. సబ్సిడీ తీసేయగా సిలిండర్ ధర రూ.555 ఉంది. అదే సబ్సిడీ ఎత్తివేస్తే సిలిండర్ ధర రూ.955 అవుతుంది.