హైదరాబాద్లోని మాదాపూర్ (Madhapur) కొత్తగూడ చౌరస్తాలో మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఎంబీ మాల్ దగ్గర్లోని మహీంద్రా వీవీసీ కంపెనీ షోరూంలో (Mahindra Cars Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగగా స్థానికులు, సిబ్బంది గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని 4 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. షోరూంలో పని చేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వాహనాలు దగ్ధమైనట్లు సిబ్బంది తెలిపారు.
భారీగా ఆస్తి నష్టం జరిగిందని షోరూం యాజమాన్యం తెలిపింది. ప్రమాద సమయంలో షోరూంలో 30 కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 12 ఖరీదైన కార్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంతో దట్టమైన పొగలు వ్యాపించగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.