: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్హెచ్ ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని మంత్రి తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్లో మాత్రమే మార్పులు జరుగుతాయని, లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పథకం కింద రూ.60 వేలు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్ధేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన మొత్తాన్ని (రూ.60 వేలను)కూడా లబ్ధిదారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందచేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం నేపథ్యంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వంతో సహకరించాలని మంత్రి పొంగులేటి కోరారు.
































