ఫోన్ పేలో కొత్త ఫీచర్.. పిన్ అవసరం లేకుండానే పేమెంట్ పూర్తి

యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్‌పే వాడుతున్న కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్. తక్కువ మొత్తంతో లావాదేవీలు చేసేవారు ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్‌కు పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరంలేదు. దేశీయ దిగ్గజ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ గురువారం యూపీఐ చెల్లింపుల కోసం సరికొత్తగా బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ ద్వారా లావాదేవీలను పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ రూ. 5,000 వరకు లావాదేవీలకు వేగవంతమైన ‘వన్-టచ్ ‘ పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం రూ. 5,000 వరకు యూపీఐ చెల్లింపులకు బయోమెట్రిక్‌ను ఉపయోగించవచ్చు. ఈ పరిమితి దాటిన మొత్తం లావాదేవీలకు కస్టమర్లు పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.


ఈ పరిమితి ముఖ్యంగా స్నేహితులు, కుటుంబసభ్యులు, దుకాణాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. రద్దీ ఉన్న ప్రదేశాల్లో, తక్కువ సమయంలో లావాదేవీలను పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగప్డుతుందని, ఎవరైనా మన పిన్ నంబర్‌ను చూస్తారనే ఆందోళన ఉండదని ఫోన్‌పే అభిప్రాయపడింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఫోన్‌పే యాప్‌లోని ప్రొఫైల్‌లో మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. బయోమెట్రిక్ పేను ఎంచుకుని, బ్యాంకు అకౌంట్‌ను ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్, బయోమెట్రిక్ ద్వారా వన్-టైమ్ సెటప్‌ను పూర్తి చేయడమే. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయి యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, త్వరలో ఐఓఎస్ యూజర్లకు కూడా అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.