చాలా కాలంగా ఎదురుచూస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ రెగ్యులేటరీ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA). యూపీఐ అమలుకు సంబంధించిన రెగ్యులేషన్స్ జారీ చేస్తూ గురువారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది. మరి ఈ కొత్త పింఛను పథకం అర్హతలు, నిబంధనల గురించి తెలుసుకుందాం.
అర్హులు వీరే..
నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఏప్రిల్, 1, 2025 నాటికి సర్వీసులో ఉండి ఇప్పటికే ఎన్పీఎస్ పథకంలో ఉన్న వారు అర్హులు. అలాగే ఏప్రిల్ 1, 2025 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే కొత్త ఉద్యోగులు విధుల్లో చేరిన 30 రోజుల్లోగా యూపీఎస్లో చేరాల్సి ఉంటుంది. 31 మార్చి 2025 లోపు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు సైతం అర్హులే. అలాగే యూపీఎస్ ఎంచుకునే లోపే రిటైర్ అయినా, లేదా మరణించినా జీవిత భాగస్వామికి అర్హత లభిస్తుంది. అయితే ఒకసారి యూపీఎస్ పథకంలో చేరితే మళ్లీ ఎన్పీఎస్ వంటి పాత పెన్షన్ పథకాల్లోకి మారేందుకు అవకాశం ఉండదు.
యూపీఎస్లో నెలవారీ కంట్రిబ్యూషన్ ఎంత?
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఉద్యోగులు తమ బేసిక్ వేతనం నుంచి 10 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది యూపీఎస్ సబ్స్క్రైబర్ PRANలో క్రెడిట్ అవుతుంది. దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం సైతం జమ చేస్తుంద. అలాగే అదనంగానూ చెల్లించేందుకు అవకాశం ఉంది. బెసిక్ పే, డీఏలో 8.5 శాతం వరకు చెల్లించవచ్చు. ఇది అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తుంది. యూపీఎస్ సబ్స్క్రైబర్ కనీసం 10 ఏళ్లు ఉద్యోగం చేసినట్లయితే ఆ తర్వాత నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్లో లాకిన్ పీరియడ్ 3 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత 25 శాతం ముందస్తుగా పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే ఇలా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
యూనిఫైడ్ పెన్షన్ పథకం సబ్స్క్రైబర్ సర్వీసును బట్టి పెన్షన్ లెక్కింపు అనేది ఉంటుంది. 25 సంవత్సరాలు లేదా అంతకు మించి ఉద్యోగం చేసినట్లయితే రిటైర్మెంట్ చివరి 12 నెలల కనీస వేతనం సరాసరి తీసుకుంటారు. అందులో 50 శాతం పింఛనుగా అందిస్తారు. 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు సర్వీసు ఉంటే కనీస పెన్షన్ రూ.10 వేలు అందిస్తారు. పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్ చెల్లిస్తారు. యూపీఎస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులు, వారి కుటుంబాలకు డియర్నెస్ రిలీఫ్ వస్తుంది. నెల జీతంలో 10 శాతం చొప్పున ప్రతి 6 నెలలకు లెక్కించి రిటైర్మెంట సమయంలో చెల్లిస్తారు. అయితే, ఇది పెన్షన్ పై ప్రభావం చూపించదు.