గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం.

గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దు అయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను విజయవంతంగా లబ్ధిదారులకు అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే అర్హులై ఉండి కూడా పింఛన్‌ అందని వారి కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అటు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిపొందుతున్న వారు ఇక నుంచి కోరిన చోటనే పింఛన్‌ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లాలోని ఇతర మండలాలకు కానీ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకుని తీసుకునే అవకాశం ఇచ్చింది. లబ్ధిదారులు ముందుగా తాము పింఛన్‌ పొందుతున్న సచివాలయాన్ని సంప్రదించి అక్కడి నుంచి ఎక్కడికి పింఛన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంది.