ఈ ఏడాది ఏపీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ ప్రవేశాలు లేనట్లే..! ఎందుకంటే

www.mannamweb.com


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులకు దూర విద్య ద్వారా పట్టాలు అందించిన అంబేడ్కర్‌ సార్వత్రిక యూనివర్సిటీ షాక్‌ ఇచ్చింది.

ఏపీ విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తూ పరకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఏపీ వారికీ ప్రవేశాలు కల్పించాలంటూ ఆ రాష్ట్ర ఉన్నత విద్య అధికారులు కొద్దిరోజుల క్రితం కోరిన నేపథ్యంలో వర్సిటీ అధికారులు గతంలో ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అయతే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్‌లో మార్పులు చేసి, చదువుకునేందుకు అవకాశం ఇస్తామని వర్సిటీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా నిర్ణయం తీసుకుంటేనే అక్కడి విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. అంబేద్కర్ యూనివర్సిటీలో గత విద్యా సంవత్సరం మూడేళ్ల డిగ్రీ కోర్సులో దాదాపు 1.54 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో 70 శాతం మంది తెలంగాణ, 30 శాతం మంది ఏపీకి చెందిన విద్యార్ధులు ఉండటం గమనార్హం. గతేడాది డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో 48,600 మంది ప్రవేశాలు పొందారు.

ఆగస్టు 22 నుంచి ఏపీ డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 22 నుంచి 24వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 23 నుంచి 25 వరకు కళాశాలల ఎంపిక వెబ్‌ ఐచ్ఛికాల నమోదు చేసుకోవాలి. వెబ్‌ ఐచ్ఛికాల మార్పునకు ఆగస్టు 26న అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 29న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 3లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.