బ్యాంకు చెక్‌ మోసాలకు ఇక చెక్‌.. కొత్త వ్యవస్థతో బహుళ ప్రయోజనాలు.. వివరాలు ఇవి

www.mannamweb.com


బ్యాంకింగ్‌ వ్యవస్థ పకడ్బందీగా ఉంటుంది. నియమాలు, నిబంధనలు కచ్చితంగానే అమలు అవుతుంటాయి. అయినప్పటికీ మోసాలు, చోరీలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే బ్యాంకర్లు అనేక రకాలుగా వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఉంటాయి.

సాధారణంగా బ్యాంకు లావాదేవీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, చెక్‌ వంటి విధానాల ద్వారా జరుగుతుంటుంది. చెక్‌ ఆధారిత లావాదేవీలకు అధిక భద్రత ఉంటుందని చాలా భావిస్తారు. అయితే అవి కూడా ఇటీవల కాలంలో ఫోర్జరీలు జరగడం, నకిలీ చెక్‌లతో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చెక్ ఆధారిత లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. మోసాల ప్రమాదాన్ని తగ్గించడానికి పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్‌)ని ప్రవేశపెట్టింది. చెక్కులకు మోసపూరితమైన లేదా అనధికారిక మార్పులను గుర్తించడానికి ఈ వ్యవస్థ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాజిటివ్ పే అంటే ఏమిటి?

పెరుగుతున్న చెక్ ఫ్రాడ్ కేసులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ 2021లో పాజిటివ్ పే సిస్టమ్‌(పీపీఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఇది ఒక ఎలక్ట్రానిక్ ప్రామాణీకరణ ప్రక్రియ, దీనిలో మీరు అధిక-విలువ గల చెక్కును చెల్లింపు కోసం సమర్పించే ముందు దాని ముఖ్య వివరాలను మీ బ్యాంక్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. అంటే చెక్కు జారీ చేసేవారు (డ్రాయర్) ఆ చెక్కు వివరాలను లబ్ధిదారునికి అందజేసే ముందు వారి బ్యాంకుత పంచుకుంటారు. ఈ వివరాలలో సాధారణంగా చెక్ నంబర్, చెక్ తేదీ, చెల్లింపుదారు పేరు, ఖాతా నంబర్, మొత్తం, ఇతర సంబంధిత వివరాలు ఉంటాయి.

ఇది ఎలా పని చేస్తుంది?

లబ్ధిదారుడు ఎన్‌క్యాష్‌మెంట్ కోసం చెక్కును సమర్పించినప్పుడు, డ్రాయర్ అందించిన సమాచారంతో బ్యాంక్ వివరాలను ధ్రువీకరిస్తుంది. వివరాలు సరిపోలితే, చెక్ ప్రాసెస్ అవుతుంది. ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే, తదుపరి ధ్రువీకరణ కోసం బ్యాంక్ చెక్‌ను హోల్డ్‌ చేస్తుంది. ప్రక్రియ ఇలా ఉంటుంది.

చెక్కు జారీ చేయండి: మీరు రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును జారీ చేసినప్పుడు, మీరు దాని వివరాలను స్వచ్ఛందంగా మీ బ్యాంకుకు సమర్పించవచ్చు.
చెక్ వివరాల షేరింగ్‌: మీరు వివిధ ఛానెల్‌ల (నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఎస్‌ఎంఎస్‌ లేదా బ్రాంచ్) ద్వారా చెక్ నంబర్, తేదీ, మొత్తం, చెల్లింపుదారు పేరు, ఖాతా నంబర్ వంటి సమాచారాన్ని బ్యాంక్‌కి అందిస్తారు.
బ్యాంక్ ధ్రువీకరణ: చెల్లింపు కోసం చెక్కును సమర్పించినప్పుడు బ్యాంక్ ఈ వివరాలను ధ్రువీకరిస్తుంది.
మెరుగైన భద్రత: వివరాలు సరిపోలితే, చెక్ క్లియర్ అవుతుంది. ఏదైనా వ్యత్యాసాలు హోల్డ్‌లో ఉంచుతుంది. మోసపూరిత చెక్కులను నగదుగా మార్చే అవకాశాలను తగ్గిస్తుంది

ప్రయోజనాలు ఇవి..

మోసాన్ని తగ్గిస్తుంది: చెక్ వివరాలను ధ్రువీకరించడం ద్వారా నకిలీ చెక్కుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక భద్రత: మీ చెక్ చెల్లింపులకు అదనపు రక్షణ పొరను జోడిస్తుంది.
వేగంగా క్లియరెన్స్‌: వ్యత్యాసాల కారణంగా చెక్ రిటర్న్‌ల అవకాశాలను తగ్గిస్తుంది.

ఇవి విషయాలు గుర్తుంచుకోండి..

ప్రస్తుతం రూ.50,000 నుంచి రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఇది ఆప్షనల్‌. ఖాతాదారుడి అవసరం అనుకుంటే వివరాలు షేర్‌ చేయొచ్చు.
రూ.5 లక్షలకు మించిన చెక్కులకు పాజిటివ్ పే సిస్టమ్‌ తప్పనిసరి.
మీరు చెక్ వివరాలను సమర్పించిన తర్వాత, మీరు వాటిని మార్చలేరు లేదా తొలగించలేరు.
మీరు చెక్కును అందించడానికి ముందే దాని చెల్లింపును నిలిపివేయవచ్చు.
భారతదేశంలోని చాలా బ్యాంకులు రూ. 50,000 కంటే ఎక్కువ చెక్కుల కోసం పీపీఎస్‌ని అమలు చేస్తున్నాయి. పాజిటివ్ పే సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలో మరినఇ వివరాల కోసం కస్టమర్‌లు తమ సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి.