సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఇక నో వెయిటింగ్,,,కేవలం పదే నిమిషాల్లో రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసే నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.


విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చే విధానాన్ని సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం పది నిముషాల్లోగా 3 డాక్యుమెంట్స్‌ను రిజిస్టర్ చేసి.. గంటలోపే ముగ్గురికి డాక్యుమెంట్స్ అందజేశారు.పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించిన ఈ పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ విధానం మంచి ఫలితాలు ఇస్తే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.

మరోవైపు రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కాపీని వాట్సా్ప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందజేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిలబడే విధానం లేకుండా కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే అవకాశం రావటంతో స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ఏప్రిల్ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. ఈ స్లాట్ బుకింగ్ విధానం తెచ్చారు. డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ వేగంగా పూర్తికావటమే కాకుండా.. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోయింది.

స్లాట్ బుకింగ్ విధానం ఏంటీ..

ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు తొలుత ఏపీ రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్న ఆస్తులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. అనంతరం డాక్యుమెంటు తయారీని పూర్తి చేస్తే.. వారికి ఓ దరఖాస్తు ఐడీ వస్తుంది.ఈ ఐడీ ద్వారా స్టాంపు డ్యూటీ, ఇతరత్రా ఫీజులు చెల్లించాలి. ఆ తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో తమకు అనువైన సమయాన్ని రిజిస్ట్రేషన్‌కు కోసం ఎంపిక చేసుకుని.. స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే వారికి క్యూఆర్‌ కోడ్‌తో ఉండే.. ఓ యూనిట్‌ డిజిటల్‌ టోకెన్‌ జారీ అవుతుంది. ఈ యూనిట్ డిజిటల్ టోకెన్‌లో ఇచ్చిన సమయం ప్రకారం.. ఆ టైమ్‌కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ అందుబాటులో ఉంటుంది. అడ్వాన్స్ స్లాట్‌ బుకింగ్‌కు ఎలాంటి ఫీజు లేదు. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకుని ఆ తర్వాత క్యాన్సిల్ చేస్తే మాత్రం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తమ స్లాట్ వాయిదా వేసుకోవాలని అనుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.