అభిమానులు తనపై చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు నటి సమంత (Samantha). వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెన్నై వేదికగా ఇటీవల జరిగిన బిహైండ్వుడ్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2010 నుంచి స్ఫూర్తిదాయక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న అనంతరం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కె.బాలచందర్ సర్ పేరుతో ఈ అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను మనకు పరిచయం చేశారు. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో స్త్రీ పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి. ఆయన సినిమాల నుంచి నేనెంతో స్ఫూర్తి పొందా. ఈరోజు నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తుంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినవారందరికీ ధన్యవాదాలు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే మనల్ని ప్రేమించేవారు ఉంటారు. కానీ, రెండేళ్లు అయింది ఒక్క తమిళ సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో హిట్ అందుకోలేదు. అయినా నాపై మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మీ ప్రేమను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో కూడా నాకు తెలియదు. మీరు లేకుండా నేను లేను’’ అని ఆమె చెప్పారు. అభిమానులు డ్యాన్స్ చేయమని కోరగా.. తాను ఇప్పుడే యాక్షన్ సీక్వెన్స్ చేసి వచ్చానని.. డ్యాన్స్ చేయలేనని తెలిపారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని అన్నారు.
చెన్నైకు చెందిన సమంత ‘ఏమాయ చేసావె’తో నటిగా తెరంగేట్రం చేశారు. కెరీర్ ఆరంభం నుంచి ఆమె తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో విడుదలైన ‘కాతు వక్కుల రెందు కాదల్’ తర్వాత ఆమె తమిళంలో ఏ ప్రాజెక్ట్కు ఓకే చెప్పలేదు. సమంత కొంతకాలంగా సినిమాల్లోనే కాకుండా సిరీస్ల్లోనూ యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆమె ‘సిటడెల్ హనీ బన్నీ’తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రక్త్ బ్రహ్మాండ్’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు ఉన్నాయి. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ త్వరలో విడుదల కానుంది.