ఎవ్వరినీ వదలను.. మంత్రులు, అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

www.mannamweb.com


విపత్తు సమయంలో సరిగా పని చేయకుంటే ఎవ్వరినీ వదలబోనని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుంటే, మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు. వీఆర్‌లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దీనిపైనా విచారణ జరిపిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగింత మంచి ఉద్దేశంతో జరిగిందా? లేక ఓవర్ లుక్‌లో అయిందా? అనేది పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా? అని ప్రశ్నించారు. టోల్ ఫ్రీ నంబర్‌లు పనిచేయట్లేదనే ఫిర్యాదును అంగీకరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థ 5ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ పెట్టి వెంటనే సమస్య పరిష్కరిస్తానన్నారు. బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయని విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం మీడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.

ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీ వివరాలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందని సీఎంకు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్, పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని వివరించారు. 5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ చేశామని చంద్రబాబుకు అధికారులు తెలిపారు.100 శాతం ఆహారం పంపిణీ జరగాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా మూడు పూటలా ఆహారం అందించాలని తెలిపారు. 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలని చంద్రబాబు ఆదేశించారు.