పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి (AP SLPRB) నోటిఫికేషన్‌ జారీ చేసింది.


అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇక రాత పరీక్ష అక్టోబరు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌ 1 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ పేపర్‌ 2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ మేరకు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుములను చెల్లించకపోవడంతో పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్ల జారీని నిలిపివేశాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇక ప్రైవేటు కాలేజీల సంగతి సరేసరి. దీంతో చేసేదిలేక ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ వాయిదా వేసింది. మరోవైపు పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసేందుకు సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు కూడా వరుస విజ్ఞప్తులు కోరడంతో కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.