మీ వాహనంలో ఫాస్టాగ్ను సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే.. ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే.. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కారు విండ్స్క్రీన్పై ఫాస్టాగ్ను సరిగ్గా ఇన్స్టాల్ చేయని వారిపై కఠిన చర్యలకు పిలుపునిచచింది. వాస్తవానికి.. విండ్స్క్రీన్పై అతికించకపోవడాన్ని ‘లూజ్ ఫాస్టాగ్’ అంటారు. అలాంటి యూజర్స్ని బ్లాక్ లిస్ట్లో వేస్తామని స్పష్టం చేసింది.
“ఫాస్టాగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే.. టోల్ ప్లాజా వద్ద దాన్ని స్కాన్ చేయడం కష్టమవుతుంది. ఇది టోల్ వసూలు ప్రక్రియను నెమ్మదిస్తుంది. క్యూ పెరుగుతుంది.టోలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నారు. రాబోయే కాలంలో, ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ వంటి కొత్త టోల్ సిస్టమ్లు అమలు చేస్తాం. అటువంటి పరిస్థితిలో ప్రతి వాహనంపై ఫాస్టాగ్ను సరిగ్గా అతికించడం ముఖ్యం. అలా చేస్తేనే టోల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. కొందరు టోల్ గేట్లు వచ్చినప్పుడు పర్సులో నుంచి తీసి చూపిస్తున్నారు. ఇలాంటి వాటినే ‘లూజ్ ఫాస్టాగ్’గా పిలుస్తారు. ఇలాంటి ఫాస్టాగ్ యూజర్లను ఇకపై బ్లాక్లిస్ట్లోకి చేరుస్తాం.” అని భారత జాతీయ రహదారుల అథారిటీ ఓ ప్రకటనలో తెలిపింది. లూజ్ ఫాస్ట్ ట్యాగ్ గురించి సమాచారం అందించాలని టోల్ వసూలు ఏజెన్సీలకు ఎన్హెచ్ఏఐ సూచించింది. ఈ సమాచారం కోసం ప్రత్యేక ఇమెయిల్ ఐడీ అందించింది. లూజ్ ఫాస్ట్ ట్యాగ్ గురించి సమాచారం అందిన వెంటనే.. ఆ ఫాస్ట్ ట్యాగ్ను బ్లాక్ లిస్ట్ చేస్తామని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
































