అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీ విరాళాలు అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన సేవా మనోభావాన్ని కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా ఎన్నారైలు ఇటువంటి విరాళాలు ఇవ్వడం పట్ల దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది.
ఆనంద్ మోహన్ రూ.1,40,05,696 విలువైన విరాళాలను పలు ట్రస్టులకు పంపిణీ చేశారు. వాటిలో..
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ – రూ.1,00,01,116
ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ – రూ.10,01,116
ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ – రూ.10,01,116
ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ – రూ.10,01,116
ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ – రూ.10,01,116
మరోవైపు తిరుమలలో దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు మాత్రమే తాత్కాలికంగా తిరిగి అనుమతిని ఇవ్వనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
నూతన మార్గదర్శకాలు.. సిఫార్సు లేఖలు తప్పనిసరిగా ప్రామాణిక లెటర్హెడ్ పై ఉండాలి. సంబంధిత అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తించనుంది. ఇతర రాష్ట్రాల నాయకులు, ప్రముఖుల లేఖలు పరిగణనలోకి తీసుకోబడవు.
































