AP Elections 2024: ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఫలితం.. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇదీ

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌)లో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. అయితే వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసింది.


మొదటి దశ: కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం

ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకుంటారు. వారు ఏ టేబుల్‌ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. తర్వాత తమకు కేటాయించిన టేబుల్‌ వద్దకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి… కౌంటింగ్‌ సిబ్బంది అందరితో కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్‌ ద్వారా మూడు దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.

రెండో దశ: పోస్టల్‌ ఓట్ల లెక్కింపు

తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్‌లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్‌ ఓట్లు లెక్కిస్తారు.
ప్రతి 25 పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు.
పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు పూర్తికాకుండా… కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు.
ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్‌ వద్ద అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.

మూడో దశ: ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు

ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటుచేస్తారు.
ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల సీరియల్‌ నంబర్‌ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఉదాహరణకు ఒక శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారనుకుంటే ఆ నియోజకవర్గంలో సీరియల్‌ నంబర్‌ 1-14 వరకూ ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌ పూర్తయినట్టు.
ఆ తర్వాత సీరియల్‌ నంబర్‌ 15 నుంచి 29 వరకూ ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు రెండో రౌండ్‌ పూర్తయినట్లు. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రం సీరియల్‌ సంఖ్యకు అనుబంధంగా ఏ, బీ, సీ వంటి బై నెంబర్లు ఉంటే.. వాటినీ విడిగా ఒక పోలింగ్‌ కేంద్రంగానే పరిగణించి.. కౌంటింగ్‌ టేబుల్‌ కేటాయిస్తారు.
ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత సీరియల్‌ నంబర్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

నాలుగో దశ: ఈవీఎంల తుది రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్‌ చీటీలు

ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్‌ లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది.
నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి.. లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు.
మొరాయించిన ఈవీఎంల పోలింగ్‌ కేంద్రాలను, మాక్‌ పోల్‌ వీవీ ప్యాట్‌ చీటీలను తొలగించని పోలింగ్‌ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు.
లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు.
ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ను ఏర్పాటుచేసి అక్కడే లెక్కిస్తారు.
ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్‌ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసమొస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపును రిటర్నింగ్‌ అధికారి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సొంతంగా నిర్వహిస్తారు. పరిశీలకుడు ఈ ప్రక్రియ పర్యవేక్షిస్తారు.
ఈ వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు.

ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం

ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఏర్పాటుచేసే కౌంటింగ్‌ టేబుళ్లు: 14
ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు పట్టే గరిష్ఠ సమయం: 30 నిమిషాలు
ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని రౌండ్లలో, ఎంతసేపట్లో లెక్కింపు పూర్తవుతుందనేది ఆధారపడి ఉంటుంది.
ఉదయం 11 గంటలకు దాదాపు ఐదు రౌండ్ల ఫలితాలు వచ్చేస్తాయి.

ఒక్కో అభ్యర్థికి ఎంతమంది కౌంటింగ్‌ ఏజెంట్లు?

ప్రతి అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
వీరికి అదనంగా రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద ఉండేందుకు ఒక ఏజెంటును ఏర్పాటు చేసుకోవాలి.
పోస్టల్‌ బ్యాలట్ల వద్ద పరిశీలించుకునేందుకు అభ్యర్థులు వారి తరఫున ప్రత్యేకంగా కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలి.
కౌంటింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించరు.