ఎల్‌.ఆర్‌.ఎస్‌.కు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌!

25 శాతం రాయితీత్వరలో రానున్న ఉత్తర్వులు


అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్‌.ఆర్‌.ఎస్‌.(లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌)ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ అధికారులు కుమ్మక్కై, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటాన్ని లోతుగా అధ్యయనం చేయించిన ప్రభుత్వం… మొత్తం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడానికి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖల ముఖ్య కార్యదర్శులు నవీన్‌మిత్తల్, దానకిశోర్, జ్యోతి బుద్ధప్రకాశ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి 25 శాతం రాయితీ ఇచ్చి ఓటీఎస్‌ అమలుచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఎఫ్‌.టి.ఎల్‌. పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి ఓటీఎస్‌ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 2020 ఆగస్టులో ఎల్‌.ఆర్‌.ఎస్‌.ను తెరపైకి తేగా అప్పటి నుంచి అమలు తీరుపై చర్చ జరిగింది. అప్పట్లో 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి. మొత్తం ఏడెనిమిది లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్ల విషయం సీఎం దృష్టికి…

కొన్నిచోట్ల ఎల్‌.ఆర్‌.ఎస్‌. కోసం ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే అక్రమ లేఔట్లు వేసి, రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల మున్సిపల్‌ అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్‌కు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ఒకసారి రిజిస్ట్రేషన్‌ జరిగితే తర్వాత ఏమీ కాదులే అన్న ధీమాతో పలువురు అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్‌కు భారీగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. 2020 నుంచి 132 మంది రిజిస్ట్రార్లు సస్పెండ్‌ అయితే వారిలో 92 మంది కేవలం ఎల్‌.ఆర్‌.ఎస్‌. అక్రమాలకు సంబంధించిన వారే ఉన్నారు. ఇలాంటి అక్రమాలకు అధికారులు అంగీకరించకపోతే వారిని బెదిరించి సెలవులో వెళ్లేలా చేసి, అక్కడున్న క్లర్క్‌లను ఇన్‌ఛార్జులుగా పెట్టి కూడా కొన్ని చోట్ల అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్న సంఘటనలు జరిగాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎల్‌.ఆర్‌.ఎస్‌. తీసుకొచ్చినా ప్రభుత్వానికి తగినంత ఆదాయం రాకపోగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఓటీఎస్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.