ఒక చిన్న పోస్టర్ మీద రాసిన హెచ్చరిక ఒక పెద్ద ఉగ్రవాద కుట్రని బహిర్గతం చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి డా.
జీవీ సందీప్ చక్రవర్తి నాయకత్వంలో జైష్-ఇ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద మాడ్యూల్ను ధ్వంసం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్కు చెందిన ఈ తెలుగు ఐపీఎస్ అధికారి తొలుత వైద్యుడు. ఆ తర్వాత పోలీసు అధికారిగా మారిన ధీరుడు. ఆయన అప్రమత్తత, వేగంగా స్పందించే గుణం భారీ ఉగ్ర కుట్రను బయటపెట్టింది. వైట్ కోట్ (వైద్యులు) టెర్రర్గా వ్యవహరిస్తున్న జైష్ మాడ్యూల్ ఉగ్రవాదాన్ని వెలుగులోకి తేవడంలో డా. సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.
పోస్టర్ నుంచి పెద్ద కుట్ర వరకు
అక్టోబర్ 19న శ్రీనగర్లోని నౌగామ్-బున్పోరా ప్రాంతంలో జైష్-ఎ-మహమ్మద్ (JeM)పేరిట పోస్టర్లు వెలిసాయి. ఈ పోస్టర్లలో భద్రతా దళాలను హెచ్చరిస్తూ.. “తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని రాసి ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అలాంటి పోస్టర్లు చాలా అరుదుగా మాత్రమే కనిపించేవి. ఈ నేపథ్యంలో ఎస్పీ చక్రవర్తి దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. ‘కమాండర్ హంజాలా భాయ్’ అనే జైష్ ఉగ్రవాది సంతకంతో ఉన్న ఈ పోస్టర్లు ఒక పెద్ద కుట్రకి సూచనగా భావించారు.
వెనువెంటనే UAPA, ఎక్స్ప్లోసివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ల కింద కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు ఓవర్గ్రౌండ్ వర్కర్లను (ఓజీడబ్ల్యూలు) అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ను ప్రశ్నించగా.. మల్టీ-స్టేట్ JeM (జైష్) నెట్వర్క్ను బహిర్గతమైంది. ఇది జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో వ్యాపించి ఉంది.
‘వైట్ కోట్ టెర్రర్’ – డాక్టర్ల ఉగ్రవాద కుట్ర
తదుపరి దశలో పుల్వామా డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై (ఫరీదాబాద్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నవాడు), క్వాజిగుండ్కు చెందిన డాక్టర్ ఆదీల్ అహ్మద్ రతర్, లఖ్నౌకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్లను అరెస్ట్ చేశారు. మౌల్వీ ఇర్ఫాన్ ఇంటిపై జరిపిన దాడిలో టెలిగ్రాం ఛానల్ ద్వారా పాకిస్తాన్లోని జైష్ ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్తో సంబంధాలను గుర్తించారు. మొత్తం 9 మంది అరెస్టులతో పాటు, 2,900 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు, బాంబ్ తయారీ సామగ్రి, రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ పట్టుకున్నారు. ఇది రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బ్లాస్ట్కు, దీని వెనుక ఉన్న సీరియల్ బ్లాస్ట్ ప్లాన్కు కీలక ఆధారంగా మారింది.
ఈ కుట్ర రెండు సంవత్సరాల నుంచి రూపొందిందని, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢిల్లీలో బహుళ బ్లాస్ట్లు జరపాలని జైష్ ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. పుల్వామా డాక్టర్ ఉమర్ మొహమ్మద్ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్లో ఉపయోగించిన కారును నడిపినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించారు. మృతదేహానికి తల్లిదండ్రులతో నిర్వహించిన DNA టెస్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
చక్రవర్తి ప్రొఫెషనల్ జర్నీ: డాక్టర్ నుంచి ఆపరేషన్స్ స్పెషలిస్ట్కు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో జన్మించిన డా. జీవీ సందీప్ చక్రవర్తి తండ్రి డా. జీవీ రామగోపాల్ రావు (ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ), తల్లి పీసీ రంగమ్మ (ఆరోగ్య శాఖ అధికారి)లు పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు. 2010లో కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసిన తర్వాత 2014లో ఐపీఎస్లో చేరాడు. జమ్ము-కాశ్మీర్లో పూంచ్లో ఏఎస్పీ, కూప్వారాలో ఎస్పీ, కుల్గామ్, అనంతనాగ్, శ్రీనగర్లో ఎస్పీలుగా పనిచేశాడు.
ఆపరేషన్ మహాదేవ్లో పహల్గామ్ దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఎదుర్కొని హతమార్చిన జమ్ము-కాశ్మీర్ పోలీసు టీమ్కు నాయకత్వం వహించారు. ఆరు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ (గాలెంట్రీ కోసం), నాలుగు జెకే పోలీస్ మెడల్స్ (మెరిటోరియస్ సర్వీస్ కోసం) పొందాడు. 2025 ఆగస్టు 14న ఆరో గాలెంట్రీ మెడల్ అందుకున్నాడు. J&K పోలీసులలో ‘ఆపరేషన్స్ స్పెషలిస్ట్’గా పిలుస్తారు. అతని వ్యూహాత్మక మేధస్సు, వెనువెంటనే స్పందించే తత్వం ఈ ఆపరేషన్లో కీలకం.
































