వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు సారె పంపిన పవన్ కల్యాణ్

www.mannamweb.com


ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు.

ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఈవో శ్రీమతి భవానీ, ఆలయ అధికారులకు.. ఎమ్మెల్సీ సూచించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని.. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు. మొత్తం 12 వేల చీరలు పంపించారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు.

అలాగే క్యూ లైన్లు, పూజా సామాగ్రి పంపిణీ వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి పూజా కార్యక్రమం నిర్వహించడానికి మరింత ప్రదేశాన్ని కేటాయించామని ఆలయ అధికారులు శ్రీ హరిప్రసాద్ గారికి తెలిపారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తురాలికి ప్రసాదం అందేటట్లు తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడు గ్రూపులుగా ఈ వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు.