గ్రామ సభల నిర్వహణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని అన్నారు.

ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. ప్రతి రూపాయి బాధ్యతతో వ్యయం చేయాలని.. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి పీఆర్, ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డీపీఓలు, డ్వామా పీడీలు, మండలాల నుంచి ఎంపీడీఓలు, ఈవో పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు హాజరయ్యారు.