ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ ప్రకంపనలు.. అమరావతి సచివాలయంలో పోలీసుల సోదాలు..

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు ఏపీలో సంచలనంగా మారాయి. అందులో నిజమెంత అన్నది పక్కన పెడితే.. సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేయడం.. అదే సమయంలో మంత్రుల పేషీల్లోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలన్న కీలక ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ అమరావతిలో ఏం జరగబోతోంది?


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్ విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని బాంబు పేల్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌. ప్రముఖ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీమంత్రి డొక్కా ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే.. అమరావతి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇతర వస్తు సామాగ్రిని పరిశీలించారు. పలువురి నుంచి పెన్‌ డ్రైవ్‌లు, డేటా హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా తొలగించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల క్రమంలో ఈ తనిఖీలు జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరోవైపు రెవెన్యూ శాఖలో కీలక దస్త్రాల ప్రాసెస్‌ నిలిపివేయాలని ఆదేశించారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. మంత్రి పేషిలోని రికార్డులు, డాక్యుమెంట్లు జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచించారు. కాంట్రాక్టర్ల నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. అటు సెక్రటేరియట్‌లోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంది. మంత్రుల పేషిల్లోని ఫర్నీచర్, కంప్యూటర్‌ల వివరాలను నమోదు చేసుకున్న జీఏడీ అధికారులు లెక్కలు సరిపోల్చుకున్నారు. వ్యక్తిగత సామగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు మాత్రం ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి.