పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

 ఆసియా కప్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని భారత్ చిత్తు చేసింది. ఆసియా కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. దీంతో దేశ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.


టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇక పాక్ పై భారత్ సాధించిన గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. భారత జట్టుకు అభినందనలు తెలిపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “గేమ్స్ ఫీల్డ్ లో ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది” అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. కాగా, భారత జెట్లు కూలాయంటూ సంజ్ఞలు చేస్తూ మైదానంలో సెలబ్రేట్ చేసుకుని పైశాచిక ఆనందం పొందిన పాక్ ప్లేయర్లకు.. ప్రధాని మోదీ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాధారణంగా భారత జట్టు కీలక విజయాలు నమోదు చేసినప్పుడు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతుంటారు. అది చాలా కామన్. ఈసారి కొంత భిన్నంగా ఒక ప్రత్యేక పదాన్ని ఉపయోగించి ప్రధాని మోదీ విషెస్ చెప్పడం ఆసక్తికరం. భారత విజయాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ తో పోల్చడం ద్వారా గెలుపు ప్రాధాన్యతను ఆయన చెప్పకనే చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ లో మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలుపొందింది. భారత్ విజయంలో తెలుగోడు తిలక్ వర్మ కీ రోల్ ప్లే చేశాడు. అద్భుతమైన ప్రదర్శనతో పాక్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. భారత జట్టుకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తోపు వర్మ తోపు అంటూ అందరిలో ప్రశంసలు అందుకుంటున్నాడు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.