పోలవరం డిజైన్ మార్చి కట్టాల్సిందే.. విదేశీ నిపుణుల షాకింగ్ రిపోర్ట్

www.mannamweb.com


Polavaram Project Report: పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల సీపేజీని పూర్తిగా నియంత్రించాలంటే ఎక్కువ ఖర్చవుతుంది కాబట్టి వాటి జోలికి పోకుండా ఆ కాఫర్‌ డ్యాంలతోనే ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించాలని కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా విదేశీ నిపుణుల రిపోర్టు షాకింగ్‌కు గురిచేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత, నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ పరంగా సరైన ఏర్పాట్లు లేవని ఈ బృందం స్పష్టం చేసింది. ప్రాజెక్టులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై త్వరలో ఒక వర్క్‌షాప్‌ ఏర్పాటుచేయాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించింది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్‌ అంశాల్లో అనుభవం ఉన్న డేవిడ్‌ బి. పాల్, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌ జులై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండులను పరిశీలించి వెళ్లిన విదేశీ నిపుణులు కీలక సిఫార్సులు చేశారు. వారు పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గురువారం అందింది.