Poonam Kaur: చెల్లి, తల్లితో కలిస్తేనే జగన్ కు జయం.. పూనమ్‌కౌర్‌ పోస్టు వైరల్‌..

Poonam Kaur: ఏపీ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోటీచేసిన అధికార వైఎస్సార్‌సీపీ ఘోరంగా ఓడిపోయింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా.. చిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ నేతలు జీర్ణంచుకోలేకపోతున్నారు. ఇక అభిమానులు అయితే జగన్‌ ఓడిపోలేదు.. జనం ఓడిపోయారు.. ఆరు నెలల్లో జగన్‌ జనానికి గుర్తొస్తాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభిమాన నటి కూడా జగన్‌ గురించి కీలక పోస్టు పెట్టారు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.


పూనమ్‌కౌర్‌ పోస్టు వైరల్‌..
టాలీవుడ్‌ నటి పూనమ్‌కౌర్‌ మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. తెలుగుతోపాటు పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి.. సినిమాయేతర విషయాలను పోస్టు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని పూనమ్‌ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె ‘వై నాట్‌ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్‌ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించింది. ఈ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ గా మారింది. అయితే వైసీపీ అభిమాని అయిన పూనమ్‌ ఇలా పోస్టు పెట్టడంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకున్నారు.

కూటమి ప్రభుత్వంపై కూడా..
ఏపీలో అధికారంలోకి రాబోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి గురించి కూడా ఆమె ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. సుగాలి ప్రతి కేసు త్వరగా పరిష్కరించాలని కోరింది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌. ఈసారి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురించి స్పందించింది.

ఫ్యామిలీలో కలిసిపోవాలి..
ఈ ట్వీట్‌లో పూనమ్‌ జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ‘గత ఎన్నికల సమయంలో జగన్‌ విజయంలో భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. వైఎస్‌.జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు.