పశ్చిమబెంగాల్లోని ఓ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్-విద్యార్థి పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించగా.. ప్రొఫెసర్ అసలు విషయం చెప్పారు. ఇంతకు ఏం జరిగిందంటే
క్లాస్ రూమ్లోనే లేడీ ప్రొఫెసర్ను స్టూడెంట్ పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌలానా అబుల్కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్లాస్ రూమ్లో సీనియర్ మహిళా ప్రొఫెసర్-స్టూడెంట్ బెంగాల్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పూల దండలు మార్చుకుని.. ప్రొఫెసర్ నుదుట స్టూడెంట్ బొట్టు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సంచలనం రేకిత్తించడంతో ప్రభుత్వం యూనివర్సిటీ యంత్రాంగం స్పందించింది. బుధవారం విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది తన క్లాస్లో భాగమైన డ్రామా అని ప్రొఫెసర్ చెబుతున్నారు. విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాలని అధికారులు సూచించారు.
నదియా జిల్లాలోని హరిన్ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ మహిళా ప్రొఫెసర్.. పెళ్లి కూతురిగా రెడీ అయ్యారు. మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ‘సిందూర్ దాన్’, ‘మాలా బోడోల్’ (పూల దండలు మార్చుకోవడం)’తో సహా హిందూ బెంగాలీ వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలను పాటిస్తూ.. క్లాస్రూమ్లోనే వివాహం చేసుకున్నారు. పక్కన ఉన్న మరికొందరు విద్యార్థులు వారికి క్లాప్స్ కొడుతూ.. పెళ్లికి అభినందలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
వర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ నుంచి వివరణ కోరినట్లు అధికారులు తెలిపారు. ఇది సైకో డ్రామా ప్రదర్శన అని.. అది తన క్లాస్లో భాగమని ఆమె వివరణ ఇచ్చారు. వీడియోలను ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ కోసం తీసినట్లు అధికారులకు చెప్పారు. అయితే సైకాలజీ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు కొందరు కావాలనే వీడియోలను లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మండిపడ్డారు. అయితే విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రొఫెసర్ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఇతర విభాగాలకు చెందిన ముగ్గురు మహిళా అధ్యాపకులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోందన్నారు.
యూనివర్సిటీ ఆఫీషియేటింగ్ వైస్-ఛాన్సలర్ తపస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ ఇది తన క్లాస్ ప్రదర్శనలో భాగమని వివరించారని చెప్పారు. అనుచితం, అనైతిక ప్రవర్తన లేదని.. ఇది పూర్తిగా విద్యాపరమైన ప్రాజెక్ట్ అని ఆమె వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సెలవుపై కొనసాగాలని తాము ఆమెను కోరామన్నారు. కమిటీ తన నివేదిక సమర్పించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. విచారణ ముగిసే వరకు తరగతులకు హాజరు కావద్దని ఆ స్టూడెంట్కు కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు.