Punganur Politics: పుంగనూరులో హై టెన్షన్.. తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హౌజ్ అరెస్ట్..

పుంగనూరు నివురు గప్పిన నిప్పులా మారింది. టీడీపీ-వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరింది. రాజకీయ కక్షతో వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు ఎంపీ మిథున్‌రెడ్డి. భౌతిక దాడులే కాదు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు పుంగనూరులో వచ్చిందన్నారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో తిరిగే రైట్ లేదా అని ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే వారిని పరామర్శించకుండా హౌజ్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. దేనికైనా రెడీ అని.. తనను అరెస్ట్ చేసినా.. ఆఖరికి చంపినా డోంట్ కేర్ అన్నారు. తాను చనిపోయినా ప్రజాసేవ చేసేందుకు తన ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారని చెప్పారు. చంద్రబాబు ట్రాపులో చల్లా బాబు పడొద్దని..అది ఆయనకే నష్టమన్నారు. ఒక ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలిసే హక్కు తనకు ఉందని.. కానీ కలవకుండా తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.


మరోవైపు.. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పుంగనూరులో నిరసనకు దిగారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు పుంగనూరులో అడుగు పెట్టొద్దని రోడ్డుపై బైఠాయించారు. అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నాకు దిగారు.పెద్దిరెడ్డి గోబ్యాక్.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.