అందంగా ఉందని, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని కుటుంబసభ్యులెవరూ ఊహించలేదు.
కుక్క పిల్ల కాలి గోరే గుచ్చుకుంది కదా..! అని అజాగ్రత్తగా వ్యవహరించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకుడు రేబిస్ సోకి మరణించాడు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన ముత్తెబోయిన సందీప్ (25) రెండు నెలలు క్రితం వీధిలో అందంగా కనిపించిన ఓ కుక్క పిల్లను పెంచుకునేందుకు ఇంటికి తెచ్చుకున్నాడు. దానిని మచ్చిక చేసుకునే క్రమంలో కుక్కపిల్ల సందీప్ తండ్రి పున్నయ్యను కరిచింది.
అలాగే సందీ్పకు కూడా ఆ కుక్కకాలి గోరు గుచ్చుకుంది. వెంటనే, తన తండ్రి కి పినపాక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కానీ, తనకు కాలి గోరే కదా గుచ్చుకుందని నిర్లక్ష్యంచేశాడు. ఇలా రెండు నెలలుగా గొర్రెలు కాచుకుంటున్న క్రమంలో అతనికి రేబీస్ లక్షణాలు కనిపించాయి. వ్యాధి తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు మణుగూరు, భద్రాచలం ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. వ్యాధి ముదిరి సోమవారం రాత్రి సందీప్ మృతి చెందాడు.
































