AP Rains: ఏపీలో వర్షాలు ఇంకా తగ్గలేదు.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

www.mannamweb.com


AP Rains: ఏపీలో వర్షాలు ఇంకా తగ్గలేదు.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇంకా వీడలేదు. మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 29, సోమవారం మన్యం, అల్లూరి, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అటు తూర్పుగోదావరి జిల్లా వాసులనూ వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. గత వారం రోజులుగా పడవల మీదే ప్రయాణిస్తున్నారు లంక ప్రజలు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో పశ్చిమగోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వ్యవసాయ, వాణజ్య పంటలు పూర్తిగా నీట మునగడంతో లబోదిబోమంటున్నారు.

ముంపు గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. మంత్రి నిమ్మల రామానాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎలమంచిలి మండలం కనకాయలంకలో వరదలో చిక్కుకున్న మూగజీవాలను అధికారులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. ముంపు బాధితులకు 3వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. నగదుతోపాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.