ఏపీ పోలీసుల విచారణకు హాజరుకానున్న రామ్ గోపాల్ వర్మ..

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 7) రోజున ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జీవీని అసభ్యకర పోస్టుల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.


చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆర్జీవీ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన ఏపీ పోలీసులు.. ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన షూటింగ్‌ ఉందని, అందుకే తాను విచారణకు రాలేనని సమాధానమిచ్చారు. అయితే ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని రాంగోపాల్‌వర్మ చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకు పోలీసులు అనుమతించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆర్జీవీ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారని సమాచారం.

వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌, తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గతంలో రెండు సార్లు విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని ఆర్జీవీకి హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.