బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై గంటల్లోనే చెక్ క్లియరెన్స్

www.mannamweb.com


ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ లావాదేవీలు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం భావించినట్లుగా ప్రజలు అత్యధిక శాతం డిజిటల్ పేమెంట్స్ మీదే ఆధారపడుతున్నారు. అలాగే బ్యాంకింగ్ రంగానికి సంబంధిచి కూడా ఎన్నో మార్పులు జరిగాయి. గతంతో పోలిస్తే.. సేవలు అనేవి గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు చాలా వరకు బ్యాంకుకు వెళ్లకుండానే మన పనులు ఫోన్ లోనే అయిపోతున్నాయి. కానీ, ఇప్పటికీ ఒక చెక్ క్యాష్ గా మారాలి అంటే మాత్రం రెండ్రోజుల సమయం పడుతోంది. బ్యాంకులు ఈ చెక్కు క్లియరెన్స్ విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. తాజాగా ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

ఇప్పటికీ బ్యాంకు సేవల్లో అత్యంత ఆలస్యంగా జరుగుతున్న పని ఏదైనా ఉంది అంటే.. అది చెక్ క్లియరెన్స్ అనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చెక్కును క్యాష్ గా మార్చుకోవడానికి కనీసం రెండ్రోజుల సమయం పడుతోంది. మనీ విత్ డ్రా, ఏటీఎం, మనీ ట్రాన్స్ ఫర్ ఇలాంటి సేవలు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. కానీ, చెక్ విత్ డ్రా మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చెక్కు క్లియరెన్స్ అనేది కేవలం గంటల వ్యవధిలోనే జరిగేలా ఒక కీలకమైన మార్పును ప్రకటించింది.

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2024లో ఈ చెక్ విషయమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం చెక్ క్లియరెన్స్ కి సంబంధించి బ్యాంకులు టీ+1 విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయాన్ని గంటలకు కుదించాలని భావిస్తున్నారు. అందుకోసం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ విధానంలో మార్పులు చేయబోతున్నారు. ఇక నుంచి బ్యాచుల వారీగా ప్రాసెసింగ్ చేయకుండా ఉండాలని భావిస్తున్నారు. ఇకపై ఆన్ రియలైజేషన్ సెంటిల్మెంట్ విధానాన్ని అవలంభించబోతున్నాం అని ప్రకటించారు. బ్యాంకులు పనివేళలో చెక్కును స్కాన్ చేయాలి. ఆ తర్వాత దానిని ప్రెజెంట్ చేసి.. కొన్ని గంటలలోపే పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రెండ్రోజుల వ్యవధి పడుతున్న చెక్ క్లియరెన్స్ విధానం కొన్ని గంటల్లోకి వచ్చేస్తుంది. బ్యాంకు ఖాతాదారుల ఎక్స్ పీరియన్స్ ని మెరుగు పరిచే విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.