డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

www.mannamweb.com


భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, దేశీయ స్థాయిలో ప్రతి చిన్న అడుగు వేయడం మానుకోవడం లేదు.

ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ పెద్ద ప్రకటన చేసింది. కొత్త పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ బ్యాంక్ నోట్ ఈ ఏడాది చివర్లో వినియోగంలోకి రానుంది. సెంట్రల్ బ్యాంక్ మెరుగైన భద్రత, హోలోగ్రామ్ ఫీచర్ల కోసం ఇప్పటికే ఉన్న అన్ని బ్యాంకు నోట్లను కూడా రీడిజైన్ చేస్తుంది.

గవర్నర్ సమాచారం:

ప్రస్తుతం ఉన్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేస్తున్నామని ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సెనేట్ కమిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తెలిపారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రూపొందించిన బ్యాంకు నోట్లను డిసెంబర్‌లో విడుదల చేస్తామని అహ్మద్ తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. పాత నోట్లు ఐదేళ్ల పాటు చెలామణిలో ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ వాటిని మార్కెట్ నుండి తొలగిస్తుంది. కొత్త పాలిమర్ ప్లాస్టిక్ బ్యాంక్ నోట్‌ను ప్రజలకు ఒక డినామినేషన్‌లో జారీ చేస్తామని, మంచి స్పందన వస్తే, ఇతర డినామినేషన్లలో కూడా ప్లాస్టిక్ కరెన్సీని జారీ చేస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీకి తెలిపారు.

మొదటి దేశం ఆస్ట్రేలియా

దాదాపు 40 దేశాలు ప్రస్తుతం పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. వీటిని నకిలీ చేయడం కష్టం, హోలోగ్రామ్‌లు, పారదర్శక విండోలు వంటి మరింత అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. 1998లో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఆస్ట్రేలియా. రూ. 5,000 నోటును రద్దు చేసే ఆలోచన సెంట్రల్ బ్యాంక్‌కు లేదని అహ్మద్ ధృవీకరించారు. అయితే, దీనివల్ల అవినీతిపరులు తమ వ్యాపారాలు చేసుకోవడం సులభతరం అవుతుందని సభ్యుడు మొహ్సిన్ అజీజ్ పట్టుబట్టారు.