అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని వారికి వివిధ పథకాలను అందిస్తూ వారి అభ్యున్నతికి దోహదం చేస్తుంది.
ఇదే క్రమంలో కేంద్రం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని సామాన్య ప్రజల కోసం తీసుకువచ్చింది.
అసంఘటిత రంగ కార్మికులకి కేంద్రం వరం ఈ పథకం
ఈ పథకం ద్వారా 60ఏళ్లు నిండిన తర్వాత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైనా సరే నెలకు మూడువేల రూపాయల పెన్షన్ పొందవచ్చు. అద్భుతమైన పెన్షన్ ఇచ్చే స్కీమ్ గురించి తెలుసుకుందాం. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ధన్ యోజన పథకం సరైన ఉద్యోగం లేనివాళ్లకు, పనివాళ్ళు, వాచ్మెన్ లు, మెకానిక్ లు, చెప్పులు కుట్టేవారు, చేనేత కార్మికులు, ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం తీసుకువచ్చిన పథకం.
55 రూపాయలు కట్టి, ప్రతీ నెల 3000పెన్షన్
ఈ పథకం ద్వారా 55రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి 60 ఏళ్ల తర్వాత దర్జాగా ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? 60 ఏళ్ల వయసు తర్వాత ఏ విధంగా పెన్షన్ పొందాలి అంటే..
60 ఏళ్ళ తర్వాత ప్రతీనెల పెన్షన్
పేద ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ పథకంలో పెన్షన్ పొందాలి అంటే ముఖ్యంగా వీరు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అయి ఉండాలి. నెలకి 15వేల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తూ ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐసీ సభ్యులు కాని వారై ఉండాలి. 60 ఏళ్ల వరకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా 3000 రూపాయలు కనీస పెన్షన్ వస్తుంది.
పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే భార్యకు అందులో 50 శాతం
ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి ఏ కారణాలతో నైనా మరణిస్తే అందులో 50 శాతం పెన్షన్ భార్యకు లేదా భర్తకు వస్తుంది. ఈ పథకంలో ఒకసారి దరఖాస్తు చేసుకునే వారు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతినెల కచ్చితంగా బ్యాంకు నిర్దేశించిన మేరకు డబ్బులు చెల్లించాలి. 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్, వివరాలు ఇలా
ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, వాయిదాలు ఆటోమేటిగ్గా కట్ కావటానికి అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి పి ఎం ఎస్ వై ఎం స్కీం అధికారిక వెబ్సైట్ https://labour.gov.in/pm-sym లో లాగిన్ అయ్యి, సంబంధిత వివరాలను నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఆపై ప్రతినెల బ్యాంకుకు ప్రీమియం కట్టాలి. అప్పుడే ప్రతి నెల 3000 రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.
































