మళ్లీ తెరపైకి రుషికొండ ప్యాలెస్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


విశాఖ రుషికొండ భవనాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. దీనిని సందర్శించడంతో అప్పట్లో రుషికొండపై తీవ్ర చర్చ జరిగింది. రుషికొండ భవనం లోపలి సౌకర్యాలు, బాత్ రూమ్ ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత వైభవంగా నిర్మించిన రుషికొండ అప్పట్లో టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్‌గా నిలిచింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి వ్యక్తమైంది. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో రుషికొండపై అక్రమంగా నిర్మాణాలు చేశారని ఆరోపిస్తూ వచ్చింది. ఇక టీడీపీనే అధికారంలోకి రావటంతో ఈ భవనాలను ఏం చేస్తారనే ఆసక్తి వ్యక్తమైంది. ఆ తర్వాత ఈ అంశాన్ని ఎవరూ ప్రస్తావించకపోవటంతో.. మరుగునపడింది.

అయితే విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ.. మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైజాగ్‌లోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రుషికొండ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.రుషికొండ భవనాలపై చంద్రబాబు దృష్టి సారించారని.. రుషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు.

మరోవైపు పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాలు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం రూ.420 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవనాలు నిర్మించిందని టీడీపీ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అత్యంత విలాసవంతమైన నివాసాలు, కార్యాలయ భవనాలను ఏడింటిని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. రుషికొండపై కట్టిన భవనాల్లో ప్రత్యేక నివాస భవనాలు మూడు ఉన్నాయి. వాటిలో పన్నెండు పడక గదులు నిర్మించారు. భారీ సమావేశ మందిరాలు, హోం థియేటర్లు ఉన్నాయి. అలంకరణ వస్తువులు, అత్యాధునిక ఫర్నీచర్ ఏర్పాటు చేశారు.

అయితే ఇంత ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ భవనాల నిర్మాణం అక్రమమని గతంలో ఆరోపించిన టీడీపీ.. దీనిని కూల్చివేస్తుందా లేదా ఇతరత్రా అవసరాలకు వాడుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి సారించారని మంత్రి నారాయణ చెప్పిన నేపథ్యంలో.. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేదీ ఆసక్తికరంగా మారింది.