కోవిడ్-19.. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ఒక ఆశా కిరణంలా నిలిచింది. స్పూత్నిక్ వి కొవిడ్ వ్యాక్సిన్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్ రాకాసిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిరంతర పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు మరోమారు రష్యా సైంటిస్టులు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి నూతన టీకా (వ్యాక్సిన్)ను అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ఏడాదిపాటు పరిశోధనలు, మూడేళ్లపాటు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. దీనికి ‘ఎంటెరోమిక్స్’ అని నామకరణం చేశారు. మాస్కోలోని ప్రముఖ గామాలెయా సెంటర్లోనే ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ను కూడా అభివృద్ధి చేసింది.
‘ఎంటెరోమిక్స్’ వ్యాక్సిన్ ఒక రకమైన mRNA ఆధారిత చికిత్సా పద్ధతి అని పరిశోధకులు వెల్లడించారు.. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ అని చెప్పారు. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని వివరించారు.. ఎంటెరోమిక్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే శక్తిని కణాలకు అందిస్తుంది. మెదడు, చర్మం, కళ్లలో వచ్చే క్యాన్సర్లను కూడా ఎదుర్కొనే లక్ష్యంతో ఇది వ్యాక్సిన్ పనిచేస్తోందని చెప్పారు.
ఈ వ్యాక్సిన్ కేవలం ఔషధం కాదు, మానవ శాస్త్రంలో కొత్త మార్గం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
































