ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

www.mannamweb.com


ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు. మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.. తద్వారా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ చెప్పారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని రేవంత్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.