రేపట్నుంచి ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. వాతావరణశాఖ హెచ్చరికలు

తెలంగాణ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో ఎండలు దంచికొట్టనున్నాయి. మెున్నటి వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా.. మళ్లీ ఎండల తీవ్రత పెరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రేపటి (మార్చి 28) నుంచి రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 42 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందన్నారు.


ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, నిర్మల్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదనట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతన్న నేపథ్యంలో పిల్లలు, మహిళలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి
వీలైనంత వరకు మధ్యాహ్నం బయటకు రాకూడదు.
కళ్లకు ఎండ తగలకుండా సన్ గ్లాసెస్ వాడాలి.
కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. బయటకు వెళ్లే సమయంలో కాటన్ స్కార్ఫ్ లేదా టవల్, క్యాప్ లాంటివి
ఉపయోగించాలి.
బయట పనిచేసే కూలీలు, కార్మికులు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి గ్లాసు నీరు తాగాలి.
రోజులో కనీసం ఒక్కసారైనా లస్సీ, నిమ్మరసం, కర్భూజ వంటి జ్యూస్‌లను తీసుకోవాలి.
బయటకు వెళ్లిన సమయంలో కాస్త అలసట, కళ్లు తిరిగినట్లు అనిపించినా చల్లటి గాలి వచ్చే చెట్టు దగ్గర కూర్చోవడం, కాస్తన్ని మంచి నీరు తాగడం లాంటివి చేయాలి.
వేసవిలో ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఎక్కువగా చక్కెర ఉండే పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కడుపులో తిమ్మిరికి కారణమవుతాయి.