AP Govt: గ్రామ, వార్డు సచివాలయాలు.. మీ సేవా కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర పత్రాల్లో ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.

2019-24 మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమేరకు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గత వైసీపీ ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచించింది. కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకూ సదరు పథకాల జనరిక్ పేర్లను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ రంగులతో, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల పుస్తకాలు, ధృవీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది.

ధృవీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు కార్యదర్శులు, హెచ్ఓడీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.