ఐదేళ్ల వైకాపా పాలన.. రాయలసీమను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది. కొప్పర్తి నోడ్, కావాల్సినవారికి సౌర, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు మినహా.. సీమ గతిని మార్చేలా నిర్దిష్టమైన ప్రయత్నాలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాయలసీమ పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. ఏడాదిలోనే రూ.1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రేపోమాపో కడప ఉక్కు పనులు మొదలు కాబోతున్నాయి. రక్షణరంగ పరిశ్రమలూ రానున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చింది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేసింది. కూటమి ప్రభుత్వం మళ్లీ పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భారీ పెట్టుబడులతో పరిశ్రమలు, పునరుత్పాదక ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోనే రూ.1,59,080 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వాటి ఆధారంగా సుమారు 1,26,519 మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి సరిపెట్టకుండా.. నిర్దేశిత వ్యవధిలో వాటిని పూర్తిచేసేలా పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది.
ఇక వెలుగుల సీమ
సీమ ‘విద్యుత్ పుంత’ కాబోతోంది. 27 భారీ సౌర, పవన, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు (పీఎస్పీ), బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 16వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి. వాటిద్వారా రూ.లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు సీమ జిల్లాకు రాబోతున్నాయి. అవన్నీ పూర్తయితే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల హబ్గా మారుతుంది.
- హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవాలో ఓర్వకల్లు నోడ్ను రూ.2786.10 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు రూ.200 కోట్లతో 57 కి.మీ. పైపులైన్ ఏర్పాటుచేస్తోంది.
- ఓర్వకల్లులో జపాన్కు చెందిన ఇటోయె మైక్రోటెక్నాలజీ కార్పొరేషన్, మన దేశానికి చెందిన హైడ్రెస్ గ్రూప్, బీఎన్ గ్రూప్లు సంయుక్తంగా రూ.14వేల కోట్లతో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. దీనిద్వారా 2వేల మందికి ఉపాధి లభించనుంది.
- ఓర్వకల్లులో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ 1200ఎకరాల్లో రూ.13వేల కోట్ల పెట్టుబడితో ‘ఈవీ పార్క్’ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
- ప్రపంచంలో తొలి ‘సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు’(ఐ.ఆర్.ఇ.పి.)ను రూ.24 వేల కోట్లతో గ్రీన్కో సంస్థ కర్నూలులో ఏర్పాటుచేస్తోంది. సౌర, పవన, పీఎస్పీ ప్రాజెక్టుల ద్వారా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వస్తుంది.
- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి నోడ్ను రూ.2137 కోట్లతో అభివృద్ధి చేస్తారు.
- సత్యవేడులో రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ, కుప్పంలో 2 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు
- అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
- కొత్తగా కుప్పంలో విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. ఈ ఏడాదిలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఎయిర్స్ట్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
- కర్నూలులోని ఓర్వకల్లులో విమానాశ్రయం గత తెదేపా హయాంలోనే దాదాపు పూర్తయింది. రాత్రివేళల్లో విమానాల రాకపోకలకు వీలుగా రూ.13 కోట్లతో అభివృద్ధి పనులను ప్రస్తుతం చేపట్టింది.
- కర్నూలు నుంచి విజయవాడకు వారంలో మూడు రోజుల పాటు కొత్త విమాన సర్వీసులు జులై రెండో తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
- కడప విమానాశ్రయానికి గతంలో రెండు విమాన సర్వీసులు నడుస్తుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య నాలుగుకు పెరిగింది.
- కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భవనాలను పరిశీలించిన అధికారులు
- కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.12.30 కోట్లతో అభివృద్ధి
- కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
- పులివెందుల నియోజకవర్గంలోని 299 గ్రామాలకు వాటర్గ్రిడ్ కింద తాగునీరు అందించేందుకు రూ.480 కోట్లతో పనులు
- బద్వేలు-నెల్లూరు మధ్య రూ.3653 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు
- గత తెదేపా ప్రభుత్వం కియా పరిశ్రమ తీసుకొచ్చి వాహనరంగంలో ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చింది. ఈసారి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి రక్షణరంగ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అనంతపురం జిల్లా పాలసముద్రంలో దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను ఏర్పాటుచేస్తోంది. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కళ్యాణి గ్రూప్ రక్షణ, ఏరోస్పేస్ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనుంది.
- పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా బనకచర్ల కాంప్లెక్స్కు 200 టీఎంసీల నీటిని మళ్లించేలా ప్రతిపాదన రూపొందించింది. ఆ నీటిని రాయలసీమ సాగు, తాగు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రాజెక్టు కోసం రూ.81,900 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
- సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఐదేళ్లలో రెండుసార్లు జగన్ శంకుస్థాపన చేసినా.. కడప ప్రజల ఉక్కు కల సాకారం కాలేదు. దాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోంది. ఇటీవల కడపలో జరిగిన మహానాడు వేదికగా త్వరలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
































