దేశీయ అతిపెద్ద పీఎస్యూ బ్యాంక్ ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. తమ రిటైల్ కస్టమర్లకు ఇమీడియెట్ పేమెంట్ సర్వీసెస్ (IMPS) ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఛార్జీలు ఆగస్టు 15, 2025 నుంచి అమలు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా చేసే పేమెంట్లు, బ్యాంక్ బ్రాంచ్ ఛానళ్ల ద్వారా చేసే పేమెంట్లకు వేరు వేరుగా ఛార్జీలు ఉండనున్నాయి. కొన్నింటికి కొత్త ఛార్జీలు తీసుకొస్తుండగా కొన్నింటికి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంక్ తెలిపింది.
రూ.25 వేల వరకు ఉండే చిన్న మొత్తాల IMPS ట్రాన్సాక్షన్లు ఆన్లైన్ వినియోగదారులు ఇప్పటికీ ఉచితంగానే పూర్తి చేయవచ్చని ఎస్బీఐ తెలిపింది. అయితే, రూ.25000 ఆపైన ఆన్లైన్ ఛానళ్ల ద్వారా హై వాల్యూ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే మాత్రం ఇకపై కొంత మేర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ఛార్జీలు ఆగస్టు 15 నుంచే అమలవుతాయని స్పష్టం చేసింది. అయితే, శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు మాత్రం ఆన్లైన్ ఐఎంపీఎస్ నగదు బదిలీపై ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.
దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందిస్తుంది. ఐఎంపీఎస్ ఒక్క ట్రాన్సాక్షన్ గరిష్ఠ విలువ రూ.5 లక్షలుగా ఉంది. అంతకు మించి పంపించేందుకు అవకాశం ఉండదు. ఎస్బీఐ ఖాతాదారులు ఐఎంపీఎస్ ఛార్జీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
- ఆన్లైన్ ద్వారా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు నిర్వహిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ.2 ప్లస్ జీఎస్టీ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.
- రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపిస్తే రూ.6 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు వర్తిస్తాయి.
- రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పంపించినట్లయితే రూ.10 ప్లస్ జీఎస్టీ ఛార్జీలుగా కట్టాలి.
- గతంలో ఈ ట్రాన్సాక్షన్లు ఉచితంగా నిర్వహించే అవకాశం కల్పించగా ఇప్పుడు ఛార్జీలు విధిస్తోంది ఎస్బీఐ.
- ఇక ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే ప్రస్తుతం రూ.2 ప్లస్ జీఎస్టీ ఛార్జీగా వసూలు చేస్తోంది. గరిష్ఠంగా ఈ ఛార్జీలు రూ.20 ప్లస్ జీఎస్టీ ఉన్నాయి. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ ఖాతాదారులకు మినహాయింపు
శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్న వారికి ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను మాఫీ చేసింది ఎస్బీఐ. డిఫెన్స్ శాలరీ ప్యాకెజ్, పారా మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, సెంట్రల్ గవర్నమెంట్, పోలీస్ శాలరీ ప్యాకెజ్, రైల్వే శాలరీ ప్యాకేజ్ వంటి ఖాతాదారులకు మినహాయింపు ఉంటుంది. అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాదారులకు సైతం ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్, స్టార్టప్ శాలరీ ప్యాకేజ్, ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్లకు మినహాయింపు ఇచ్చింది.































