జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక విడుదలైంది. ఈ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమేనని, ఇందులో కుట్ర కోణం ఏదీ లేదని తెలుస్తోంది.
సకాలంలో రెండు ఇంజిన్లూ పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయింది అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తునకు సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో-AAIB 15 పేజీల ప్రాధమిక నివేదిక సమర్పించింది. విమానం ప్రమాదం జరిగి సరిగ్గా నెలరోజులకు AAIB రిపోర్ట్ సమర్పించింది. ఘటన జరగడానికి ముందు ఏమైంది.. ఇంజన్ స్వభావం ఎలా ఉంది..? వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక అంశాల్ని లోతుగా పరీక్షించి ఈ నివేదికను రూపొందించింది AAIB.
టేకాఫైన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లయ్ ఆగిపోవడంతో రెండు ఇంజన్లూ పనిచేయడం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కటాఫ్ చేశావ్ అని ఒక పైలట్ అడగ్గానే.. నేను కటాఫ్ చెయ్యలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్పిట్ ఆడియో రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. ఇంజిన్లు పవర్ను కోల్పోగానే.. ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా AAIB దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చెయ్యడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్1 రికవర్ అయినా ఇంజన్2 మొరాయించడంతో 32 సెకన్లలోనే విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది.
విమానంలో ఫ్యూయల్ క్లీన్గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రిఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా లేదని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదని తెలిపింది. పైగా ఆకాశం క్లియర్గా ఉంది. వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్కి అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏవీ లేవు. పైలట్లు ఇద్దరూ మంచి అనుభవుజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని AAIB చెబుతోంది.
కుట్ర కోణానికి సంబంధించిన ఆధారం ఏదీ లభించలేదని కూడా తేల్చేసింది AAIB రిపోర్ట్. నివేదికపై స్పందించిన ఎయిరిండియా.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని పూర్తిస్థాయి దర్యాప్తు దాకా ఆగాల్సిందేనని చెబుతోంది.
































