దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం నేడు (నవంబర్ 24) మధ్యాహ్నం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత.. ఇది 48 గంటల్లో మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శక్తివంతమైన తుపానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ తుపానుగా మారితే.. దీనికి ఐఎండీ నిర్దేశించిన పేరు పెట్టే అవకాశం ఉంది.
ఈ తుపాను వ్యవస్థ ఏర్పడడం కారణంగా తూర్పు తీర ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పాటు తెలంగాణపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో గత మూడు రోజులుగా చలి తగ్గి.. శని, ఆదివారాల్లో చాలా ప్రాంతాలలో ఉక్కపోత పెరిగింది. ఈ వాతావరణ మార్పు అల్పపీడన వ్యవస్థ నిర్మాణంతో ముడిపడి ఉంది. దీని ప్రభావంపై వాతావరణశాఖ అధికారులు రెండు ప్రధాన అవకాశాలను అంచనా వేశారు.
తుపాను వ్యవస్థ సకాలంలో ఏర్పడితే, అది ప్రధానంగా మధ్య వైపుకు కదులుతుంది. దీంతో నవంబర్ 26 నుంచి 28 మధ్య ఈ మూడు రోజులు.. ఉత్తర ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయి. ఈ సందర్భంలో చలిగాలులు ఉండవు, వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కేసు 2లో నవంబర్ 28 – 30 అల్పపీడనం ఏర్పడితే అది మరింత బలపడి భయంకరమైన తుఫానుగా మారుతుంది. అయితే, ఈ తుపాను ఒడిశా, బంగ్లాదేశ్ లేదా బర్మా వైపుకు మళ్లి తెలుగు రాష్ట్రాలకు దూరంగా వెళ్లే అవకాశం ఉంది.
తుపాను దూరంగా వెళ్లడం వలన.. తెలంగాణలో దాని ప్రత్యక్ష ప్రభావం ఉండదు. దీని ఫలితంగా రాష్ట్రంలో చలిగాలులు తిరిగి వస్తాయి. కొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొంటుంది. నవంబర్ చివరి వారంలో వాతావరణం ఏ విధంగా మారుతుందో తుపాను వ్యవస్థ ఏర్పడిన దిశ, వేగంపై ఆధారపడి ఉంటుంది. మెుత్తంగా తుపాను ఏర్పడితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో వానలు పడే ఛాన్సుంది.
































