ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు షాక్.. భయపెడుతున్న నిర్వహణ ఖర్చులు

www.mannamweb.com


ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారందరూ వీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న పెట్రోలు ధరలకు భయపడి వీటివైపు మొగ్గు చూపుతున్నారు. మహిళలు కూడా చాలా సులభంగా నడపగలిగే అవకాశం ఉండడంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మెయింటెనెన్స్ (నిర్వహణ ఖర్చులు) అధికంగా అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనేక మంది షేర్ చేశారు. వాటి వెనుక గల కారణాలను తెలుసుకుందాం.

నిర్వహణ ఖర్చులు అధికం

ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి ఇటీవల ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఏథర్ స్కూటర్ ను సర్వీస్ చేయిస్తే రూ.8 వేలు బిల్లు అయ్యిందని ఒక యాజమాని పోస్ట్ చేశాడు. తన పదేళ్ల నాటి పాత కారుకు కూడా అంత కావడం లేదని తెలిపాడు. సర్వీస్ ధర ఎక్కువగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఐసీఈ వాహనాలతో పోల్చితే ఈవీలకు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కానీ మెయింటినెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
రిపేర్లు తప్పనిసరి

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేసి కేవలం నాలుగేళ్ల మాత్రమే అయ్యింది. అలాగే 13,398 కిలోమీటర్లు తిరిగినట్టు స్పీడో మీటర్ లో చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వాహనానికి సాధారణంగా పెద్ద మరమ్మతులు అవసరం లేదు. ఈవీలతో పాటు ఐసీఈ స్కూటర్లకు వర్తిస్తుంది. ఇలాంటి సమయంలో స్కూటర్ కు రూ.8 వేల నిర్వహణ బిల్లులు వస్తే ఎవ్వరికైనా ఇబ్బంది కలుగుతుంది.

అధిక బిల్లులు

మరో ఏథర్ యజమాని చేసిన పోస్ట్ ప్రకారం.. అతడి స్కూటర్ చార్జింగ్ ఆగిపోవడంతో పాటు పీవో14 ఎర్రర్ చూపించింది. ఆ స్కూటర్ ను సర్వీసింగ్ కేంద్రానికి తీసుకువెళితే పలు సమస్యలను గుర్తించారు. కానీ ఆయా విభాగాలపై వారంటీ కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంది. దీంతో యజమానికి ఖరీదైన భాగాలను మార్చడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అలాగే అతడు రెండు నెలలుగా ఏథర్ సర్వీస్ ప్యాక్‌ ను పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆ సర్వీస్ ప్యాక్ యాక్టివ్‌గా ఉంటే, నిర్వహణ బిల్లు తక్కువగా వచ్చి ఉండేది.
రిప్లేస్‌మెంట్ ఖర్చే అధికం

కొన్ని పోస్టులు వైరల్ అయిన తర్వాత మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ ప్రకారం.. మొదటి తరం ఏథర్ స్కూటర్లలో నిర్వహణ ఖర్చు అధికంగా ఉన్నట్టు తెలిపారు. మొదటి వంద ప్రీ ఆర్డర్ జాబితాలోని ఓ వినియోగదారుడు తన స్కూటర్ మిడ్ అసెంబ్లీ భర్తీ చేశారని, దాన్ని రిపేర్ చేసే అవకాశం లేదన్నారు. దీంతో రీప్లేస్ మెంట్ ఖర్చు రూ.16 వేలు అయ్యింది.